మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఆ బాలున్ని రక్షిద్దామని వెళ్లిన అతని తల్లి గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మియాపూర్ పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్లోని బీకే ఎన్క్లేవ్ సాయినగర్లో నివాసం ఉండే యాతకారి పాండు స్థానికంగా కూలి పనులు చేస్తూ భార్య నాగమణి, కుమార్తె మేఘన, కుమారుడు శ్రీరాం (5)లతో కలిసి జీవిస్తున్నాడు. కాగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతికే ప్రాంతంలో శ్రీరాం విద్యుదాఘాతానికి గురయ్యాడు. అది గమనించిన అతని తల్లి నాగమణి అతన్ని రక్షించేందుకు అతన్ని ముట్టుకుంది. దీంతో ఆమెకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఈ క్రమంలో వారిని గమనించిన స్థానికులు కర్ర సహాయంతో వారిని విద్యుత్ షాక్ నుంచి విడదీశారు. కాగా ఇద్దరినీ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించగా శ్రీరాం చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగమణి పరిస్థితి నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






