శేరిలింగంపల్లి, జూలై 23 (నమస్తే శేరిలింగంపల్లి): హుడా కాలనీ రైల్వే పట్టాల సమీపంలో గురువారం అర్ధరాత్రి దోపిడీ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 12 గంటల సమయంలో రైల్వే పట్టాల పక్కన ఉన్న గుడిసెలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల జాన్ సయ్యద్ వద్దకు స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంచి నీళ్లు ఇవ్వాలని కోరారు. బాలుడు వారికి వాటర్ బాటిల్ ఇవ్వగా, వారు బయటకు వెళ్లి మద్యం సేవించి తిరిగి గుడిసెలోకి వచ్చారు. అనంతరం బాలుడిని బెదిరించి, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో జాన్ సయ్యద్ గట్టిగా కేకలు వేయగా, నిందితులు అక్కడే ఉన్న కత్తితో అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో బాలుడి చేతికి గాయమైంది. దాడి అనంతరం ఇద్దరు నిందితులు మొబైల్ ఫోన్ను తీసుకుని అదే స్కూటీపై అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు రాబరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






