శేరిలింగంపల్లి, ఆగస్టు 28 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రావణ మాసం సందర్భంగా చందానగర్లోని వేముకుంట, గౌతమినగర్లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో శుక్రవారం లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు పాల్గొని అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు పూజకు హాజరైన వారికి సోదరభావంతో రాఖీలు కట్టి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం సుమారు 1,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు రఘునందన్రెడ్డి తదితర నాయకులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సుమారు 1,000 మంది భక్తులకు అన్నదానం చేసిన జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ కట్ల శేఖర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆలయ ట్రస్టీలు గుఱ్ఱపు విజయలక్ష్మి, రవీందర్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.





