శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఆధ్వర్యంలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభమైంది. PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాంటీన్ను ప్రారంభించారు. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డీసీ సేవా ఇస్లావత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, CMC అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. జోనల్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో రూ.30 లక్షలతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, ఉద్యోగులకు క్యాంటీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని హంగులు, సకల సౌకర్యాలతో క్యాంటీన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. క్యాంటీన్లో టిఫిన్, భోజనం సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని గాంధీ తెలిపారు. రుచికరమైన ఆహారంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు.

కార్యక్రమంలో AMC ప్రేమ్ కుమార్, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE శిరీష, DE ఆనంద్, AE భాస్కర్, AE రషీద్, UBD మేనేజర్ విక్రమ్తో పాటు నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, తిరుపతి, TLF ప్రెసిడెంట్ వీణా, మహిళా సమాఖ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





