శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడలోని రామకృష్ణ నగర్ లో ఉన్న శ్రీ సాయికృప అపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్స్ గౌరవ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ రావు ప్రత్యేక ఆహ్వానం మేరకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుడు మారబోయిన అనిల్ కుమార్ బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

బోనాల ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బోనాల ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోయినపల్లి వినోద్ కుమార్ రావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాలలో సందడి చేశారు.






