శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న గౌతమీనగర్ కాలనీలో గత ఏడు సంవత్సరాలుగా రోడ్లు అధ్వాన్నంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో నిండిపోయిన రహదారుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటివరకు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన ఫిర్యాదును న్యూఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) స్వీకరించినట్లు తెలిపారు.

రోడ్ల దుస్థితి కారణంగా ఇప్పటికే 70 ఏళ్ల వృద్ధుడు, చిన్నారులు కిందపడి గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు పేర్కొన్నారు. తాజాగా రోడ్డులోని గుంతలో ఓ వాహనం చిక్కుకున్న ఘటనను ఉదాహరణగా చూపిస్తూ, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.





