శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో విడతలవారీగా పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్లోని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో ఉన్న పార్కులో మొక్కల సంరక్షణ, పచ్చదనం పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన బోర్వెల్ను స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పార్కులు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యత, ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తుకు కూడా ఎంతో అవసరమని అన్నారు. పార్కుల్లో నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించేందుకు నీటి వసతి కీలకమని, ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్వెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ బోర్వెల్ ద్వారా పార్కులోని మొక్కలకు ఏడాది పొడవునా తగినంత నీటి సరఫరా అందించి పచ్చదనాన్ని మరింత పెంపొందించవచ్చని చెప్పారు. అభివృద్ధి పనులు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయని పేర్కొంటూ, కాలనీ వాసులు పార్కును తమ సొంత ఆస్తిగా భావించి పరిశుభ్రత, సంరక్షణ, మొక్కల పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్లోని ప్రతి కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు, పార్కుల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల విస్తరణకు నిరంతరం కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కృష్ణంరాజు, రామకృష్ణ వర్మ, బలరాం, దుర్గరాజు, రాము, కనకరాజు, చలపతి, యూబీడీ సూపర్వైజర్ కుర్మయ్యతోపాటు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.





