శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని ముంపు ప్రాంతాలను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. బొల్లారం మెయిన్ రోడ్డు, శ్రీరంగపురం, అరబిందో కాలనీల్లో ఏర్పడిన నీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలు, రాకపోకలకు ఇబ్బందులు వంటి అంశాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ పర్యటనలో ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ ఆదిమూర్తి, జలమండలి ఈడీ సంతోష్, జీఎం కృష్ణ, డీజీఎం నారాయణ, హెచ్ఎండీఏ డీఈఈ దీప్తి, ఏఈఈ ఆషుతోష్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారులపై వరద నీరు, డ్రైనేజీ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని, విద్యుత్ తీగలు, తెరిచి ఉన్న మ్యాన్హోళ్లు, నీటితో నిండిన గుంతలు వంటి ప్రమాదకర ప్రాంతాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరమని తెలిపారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భారీ వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని శ్రీకాంత్ కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించి, వారి సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





