శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి):రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గురువారం నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గుల్మోహర్ పార్క్, నేతాజీ నగర్, డాక్టర్స్ కాలనీ ప్రాంతాల బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) స్థానిక బీఆర్ఎస్ నాయకుడు గుర్ల తిరుమలేష్తో కలిసి గుల్మోహర్ పార్క్ లైబ్రరీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అమలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఓటర్ల జాబితా పరిశీలన, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, మృతులు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ పేర్ల తొలగింపు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా గుర్ల తిరుమలేష్ మాట్లాడుతూ దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని అన్నారు.

బీఎల్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను సమావేశంలో ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని, ఏవైనా మార్పులు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత బీఎల్ఓను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుంది. అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.





