శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కు దరఖాస్తు చేసుకున్న 58 మంది బాధిత కుటుంబాలకు రూ.43,07,500 ఆర్థిక సహాయాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ప్రజాక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంలా నిలుస్తోందని, వైద్య చికిత్స కోసం ఖర్చులు భరించలేని కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భరోసాను కల్పిస్తోందని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా వైద్య చికిత్స కోసం సహకారం అందించిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, నాయకులు సంజీవ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, ఎండీ ఇబ్రహీం, మంత్రి ప్రగడ సత్యనారాయణ, చిరుమర్తి రాజు, మల్లయ్య, గోపాల్, తిరుపతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.





