శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని నరేన్ గార్డెన్లో నిర్వహించిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివేకానంద నగర్ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించి, దొంగ ఓట్లను తొలగించేలా చర్యలు తీసుకోవడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందని, వీలైనంత ఎక్కువ మందిని బీఆర్ఎస్ సభ్యులుగా చేర్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించిన ఆయన, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు మద్దతు పెంచేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, వేముల ఆంజనేయులు తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





