శేరిలింగంపల్లి, మే 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్లో కొనసాగుతున్న పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులను జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సృజన లక్ష్మీనగర్, నర్రెగూడెం, బృందావన్ టీచర్స్ కాలనీలలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే పిషక్బౌలి చెరువు వద్ద బండ్ అభివృద్ధి, ఫెన్సింగ్ పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. సృజన లక్ష్మీనగర్ ఫేజ్-3లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ అవుట్లెట్ సమస్యలను పరిశీలించిన కమిషనర్, వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బృందావన్ టీచర్స్ కాలనీలో కొనసాగుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులతోపాటు పాత అమీన్పూర్లో ఉన్న యూజీడీ అవుట్లెట్ సమస్యపై కూడా సమీక్ష నిర్వహించారు. పనుల అమలులో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశిత గడువులోగా అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సూచించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






