శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో రూ.5 కోట్ల 85 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. నల్లగండ్ల హుడా కాలనీ ప్రజల సౌకర్యార్థం రూ.5.85 కోట్లతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు కాలనీ వాసులకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

రోడ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





