శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సెంట్రింగ్ రేటును రూ.51కు పెంచాలని, కార్మికులకు ఈఎస్ఐ కార్డులు అందించాలని, ప్రతి నిర్మాణ స్థలంలో సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా కొండాపూర్ యూనియన్కు చెందిన సుమారు 200 మంది కాంట్రాక్టర్లు టూ వీలర్ ర్యాలీ నిర్వహించారు. కొండాపూర్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీగా ర్యాలీగా చేరుకుని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనియన్ చైర్మన్ విశ్వనాధ్ యాదవ్, ప్రెసిడెంట్ రాము యాదవ్, జనరల్ సెక్రటరీ సామ ఎల్లారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ జనరల్ సెక్రటరీ సామ ఎల్లారెడ్డి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమ్మెను మరో వారం రోజుల పాటు కొనసాగించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.






