శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ సమీక్షించారు. ఈ సందర్భంగా సెంట్రల్ సెన్సస్ బృందంతోపాటు శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్తో కలిసి ఖాజాగూడలోని జైన్స్ కార్ల్టన్ క్రీక్ అపార్ట్మెంట్ను అధికారులు సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న జనగణన కార్యకలాపాలను పరిశీలించిన అధికారులు, క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో సమీక్షించారు. జనగణన విజయవంతంగా అమలు కావాలంటే కచ్చితమైన, పారదర్శకమైన, సమగ్రమైన డేటా సేకరణ అత్యంత అవసరమని ఈ సందర్భంగా నారాయణ అమిత్ పేర్కొన్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో అధికారులు మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు జనగణన ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






