శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): మే 10వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరగబోయే జనాగ్రహ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలో ఉన్న వార్డు కార్యాలయం, ఎన్టీఆర్ నగర్లోని కార్పొరేటర్ కార్యాలయంలో, డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహ సభ సన్నాహక సమావేశంలో ప్రొఫెషనల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, గచ్చిబౌలి డివిజన్ ప్రభారి బల్దా అశోక్ తో కలిసి గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాగ్రహ సభ దేశభక్తి, అభివృద్ధి సంకల్పానికి ప్రతీకగా నిలవాలని అన్నారు. ప్రతి కార్యకర్త తమ బాధ్యతగా తీసుకుని ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని పిలుపునిచ్చారు. గచ్చిబౌలి డివిజన్ నుండి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






