శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): డీసీఎం డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపించడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలై మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేరళకు చెందిన అబ్దుల్ బాసిత్ మహేశ్వరంలో నివాసం ఉంటూ స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య హనియా అయేషా (22)తో కలిసి జీవిస్తున్నాడు. ఈ నెల 4న వీరు కూకట్పల్లిలోని లేక్షోర్ మాల్లో సినిమా చూసి రాత్రిపూట తమ ద్విచక్ర వాహనం (కేఎల్14ఎబి1196)పై తిరిగి వస్తుండగా 11:30 గంటల సమయంలో మాదాపూర్లోని మైండ్ స్పేస్ గేట్ ఎదుట ఉన్న అండర్ పాస్ వద్ద వేగంగా వచ్చిన డీసీఎం వాహనం (కేఏ05ఎఎల్6042) వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించగా హనియా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అబ్దుల్ బాసిత్ గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతి వేగంగా, నిర్లక్ష్యంగా డీసీఎంను నడిపించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






