శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): రిటెయిల్ చికెన్ షాపుల నిర్వాహకులకు పౌల్ట్రీ ఫామ్ల యాజమాన్యాలు మార్జిన్ను పెంచాలని శేరిలింగంపల్లి చికెన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. చందానగర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చికెన్ షాపుల నిర్వాహకులు అనంతరం పీజేఆర్ స్టేడియం నుంచి బీహెచ్ఈఎల్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల నిర్వాహకుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. తెలంగాణ రిటెయిల్ చికెన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్లో నిర్వహించిన ధర్నాకు మద్దతుగా తాము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిటెయిల్ చికెన్ షాపుల వ్యాపారులకు గత 6 నెలలుగా మార్జిన్ను తగ్గించారని, ఈ రూల్పై పౌల్ట్రీ సంఘాలకు, యాజమాన్యాలకు విన్నవించినా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప తమ సమస్యను పరిష్కరించలేదని అన్నారు. వెంటనే తమ డిమాండ్లకు అంగీకరించి తమకు ఇస్తున్న మార్జిన్ను పెంచాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






