శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): తక్షణమే ప్రభుత్వం స్పందించి చికెన్ షాపు నిర్వాహకులతో చర్చలు జరిపాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ చికెన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నాచౌక్ లో జరిగిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పౌల్ట్రీ యాజమాన్యం చికెన్ షాప్ పులకు ఇచ్చే మార్జిన్ 30 రూపాయల నుండి 16కు తగ్గించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా50వేల చికెన్ షాపు నిర్వాహకులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్లకు అంగీకరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపు నిర్వాహకులు చేస్తున్న ఈ ఉద్యమంలో భాగస్వాములై ప్రజల్ని సమాయత్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, చికెన్ షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.






