గోవిందుడికి సత్య కీర్తి నృత్య ధామం వారి కూచిపూడి నృత్యార్చన

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంట‌లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరగగా, సాయంత్రం 5 గంట‌ల నుండి అన్నమ స్వరార్చన, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి చేసి, తదుపరి సత్య కీర్తి నృత్య ధామం సంస్థ గురువు బాలాజీ కుమార్ శిష్యులు అనన్య, చైత్ర, దుతి, గిరీశ, హర్షిత, రియా, రిషిత, సత్య, శ్రీహిత, సుధీష, వైష్ణవి, వాణి, తన్వి, ధన్య, మధు, సాన్వి, మోక్ష, కార్తీక, శరణ్య, మాన్విశ్రీ, చార్విశ్రీ, ధృతి, ఆద్య, హిమాంశి, ధన్వి, లతిక తదితరులు సంయుక్తంగా మూషిక వాహన, బ్రహ్మాంజలి, జతిస్వరము, లింగాష్టకం, దశావతారం, కొలువైతివా, భావములోన, గోవిందాశ్రిత, పిడికిట తలంబ్రాలు, గోవింద గోవింద, బ్రహ్మమొక్కటే అనే సంకీర్తనా నృత్యాంశాలకు తమ భావాభినయ నైపుణ్యంతో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి కూచిపూడి నృత్యాంజలి సమర్పించారు.

శిష్యుల నృత్య ప్రదర్శనలు లయ, భావ, అభినయ సమన్వయంతో సాగి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు జ్ఞాపికలను అందించి సత్కరించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళ హారతులు సమర్పించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here