శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల కూరగాయల మార్కెట్ సమస్యలపై జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శిరీషకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, TAC మెంబర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, బీజేపీ శేరిలింగంపల్లి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్ మాట్లాడుతూ ఈ మార్కెట్ విషయంలో కొత్తగా రూ.4 కోట్లు ఖర్చుచేసి నిర్మాణం చేయడం జరుగుతుందని, ఇప్పటికే 20 నుంచి 30 షాపుల వరకు ఖాళీగా ఉన్నాయని, వాటిని వ్యాపారులకు కేటాయించకుండా, వృథాగా వదిలి పెట్టి అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ కొత్త షాపుల నిర్మాణం అవసరం లేదని, ఎవరికి లబ్ధి చేకూర్చాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారని ప్రశ్నించారు. సదరు స్థలంలో మార్కెట్ యార్డ్ నిర్మాణం కాకుండా అక్కడ వాహనాల పార్కింగ్ కు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు కిశోర్ ముదిరాజ్ , మాజీ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మారం వెంకట్ , చందానగర్ డివిజన్ మాజీ బీజేపీ అధ్యక్షుడు రాకేష్ దూబే, చందానగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ పాల్గొన్నారు.






