శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): చెరువు మన అందరి బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు పరిసర ప్రాంతాలలో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యర్ధాల తొలగింపు కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని వ్యర్ధాల తొలగింపు చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గుర్నాధం చెరువు చుట్టూ ఉన్న ముళ్ళకంప ఇతర వ్యర్థాలను కాలనీవాసులు యువత ముందుకు వచ్చి శుభ్రం చేయడం మంచి విషయమని ఆయన తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తుందని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగా మన చుట్టుపక్కల చెరువులను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు తమ శాయ శక్తుల పనిచేయాలని ఆయన యువతకు, కాలనీ అసోసియేషన్ సభ్యులకు సూచించారు. చెరువులు కనుమరుగు అవడానికి చుట్టుపక్కల ప్రజలు అది తమ చెరువు కాదని నిర్లక్ష్యంగా ఉండడమే ప్రధాన కారణం అవుతుందని ఆయన తెలిపారు. చెరువులు, కుంటలు మన జీవితంలో ఒక భాగంగా చూసినప్పుడు మాత్రమే చెరువులను రక్షించుకునే పరిస్థితి ఉంటుందని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులు, గుర్నాధం చెరువు పరిసర ప్రాంత కాలనీల వాసులు, వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.






