శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందని శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. స్థానిక ఎమ్మార్వో తక్షణమే చొరవ చూపి పాఠశాల కోసం కేటాయించిన స్థలానికి చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసి కబ్జా కోరుల నుండి స్థలాన్ని రక్షించాలని, పేద విద్యార్థినీ విద్యార్థులు చదువుకునే విధంగా చొరవ చూపి, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అన్నారు. కూకట్పల్లి మండల రెవెన్యూ పరిధిలోని అంబేద్కర్ కాలనీ డివిజన్ నం. 336లో ఉన్న ఎంపిపి స్కూల్, జెడ్పీహెచ్ పాఠశాలకు కలెక్టర్ కేటాయించిన 4 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ స్థలంలో కొందరు ఆలయాల పేరుతో దొంగ కమిటీలు వేసి ఆక్రమించాలని చూస్తున్నారని తెలిసి స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు సరిగా పట్టించుకోవట్లేదని తెలియజేయగా పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని కాపాడి పాఠశాల నిర్మాణ పనులు ప్రశాంతంగా పూర్తి చేసేలా చూడాలని కోరుతూ కౌన్సిల్ మెంబర్ కేశవులు , డివిజన్ మాజీ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి , సీనియర్ నాయకుడు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మికి రవికుమార్ యాదవ్ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కూకట్పల్లి మండల రెవెన్యూ పరిధిలోని అంబేద్కర్ కాలనీ డివిజన్ నం. 336లో ఉన్న ఎంపిపి, ZPHS పాఠశాల నిర్మాణం సంబంధించి కలెక్టర్ 08-09-2022 LC/628/2022 ప్రొసీడింగ్స్ ద్వారా 4 ఎకరాల 20 గుంటల స్థలం కేటాయించారని, ఆ తర్వాత జిల్లా విద్యా శాఖాధికారి, మండల విద్యాశాఖ అధికారికి ఉత్తర్వుల ప్రకారం (ప్రోసీడింగ్స్) నం. 1662/B2 2022. Dt. 15-12-2022 ద్వారా తేదీ 17-12-2022 నాడు పంచనామా చేసి అప్పగించారని తెలిపారు. గతంలో సిఎస్సార్ ఫండ్స్ ద్వారా HAL వారు పాఠశాలను అభివృద్ధి చేయాలని చూసినా ఆది ముందుకు వెళ్లలేదని, కానీ ఈ ప్రభుత్వ స్థలంలో కొంతమంది కావాలని ఆక్రమణలు చేపట్టాలని 1200 గజాలలో వివిధ ఆలయాల పేరుతో కమిటీని ఏర్పాటు చేసి కోర్టులో కేసులు వేసి ఆ స్థలాన్ని కొట్టేయాలని ప్రయత్నించి, ఎల్లమ్మ బండ స్కూలు ప్రధానోపాధ్యాలపై కూడా కేసులు వేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు సరిగ్గా పట్టించుకోలేదని, ఎమ్మార్వో దీనిపై దృష్టి పెట్టి ఆ స్థలాన్ని అప్పగించి పాఠశాల నిర్మాణ పనులు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, వెంకటస్వామి రెడ్డి, కుమార్ యాదవ్ , రాయల్, సురేష్, ఎస్ కే చాంద్, శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.





