శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ లో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తూ కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉందన్న విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వరద నీటి సమస్య గురించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వర్షపు నీటితో పాటు మట్టి కూడా రోడ్డు మీద రావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రోడ్డుపైన పేరుకుపోయిన మట్టిని తొలగించి శుభ్రం చేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో కాలనీలలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తూ సమస్యలు వస్తున్నాయని, వాటిని కూడా జి.ఎచ్.ఎం.సి, మాన్ సున్, హైడ్రా సిబ్బంది సకాలంలో స్పందించి వెంటనే పరిష్కరిస్తున్నారని అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఎలక్ట్రికల్, రోడ్డు, డ్రైనేజీ, మంచి నీటి వంటి సమస్య లు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులను లేదా తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, ఆంజనేయ ప్రసాద్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.






