శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గుర్ల తిరుమలేష్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుమలేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబ సభ్యులే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటారని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలన్నదే మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచన అని, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఎందరో కుటుంబాలకు కేటీఆర్ సహకారం అందించారని, కేటీఆర్ అభిమానిగా ఉద్యమకారుడిగా సంవత్సరాల నుండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు.

రాబోయే ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపడతారని తెలంగాణ రాష్ట్రం బి ఆర్ ఎస్ పార్టీతోనే సుభిక్షంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని, హైడ్రా పేరుతో లక్షల కోట్లు దోచుకుని నిరుపేదల సొంతింటి కలను వారి ఆశలను వారి జీవితాలను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విషయం అర్థమైందని, రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి రోజులు వస్తాయని అన్నారు.





