శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఉన్న మొత్తం పోలింగ్ బూత్ల వివరాల తుది జాబితాను నవంబర్ 21వ తేదీన ప్రచురిస్తామని గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు తేజావత్ వెంకన్న, నందగిరి సుధాంష్లు మీడియాకు తెలిపారు. పోలింగ్ బూత్ల వివరాలతో కూడిన డ్రాఫ్ట్ జాబితాను గురువారం ప్రచురించడం జరిగిందని, శుక్రవారం ఆ జాబితాకు గ్రేటర్ కమిషనర్ అనుమతి లభిస్తుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆ జాబితాపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 16వ తేదీన డివిజన్ల వారీగా స్థానికంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో రిటర్నింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు సమావేశాలు నిర్వహిస్తారని, 18వ తేదీ వరకు ఫిర్యాదులు, సలహాలు, సూచనలను జాబితాలో సవరించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీన పోలింగ్ స్టేషన్లతో కూడిన తుది జాబితాను గ్రేటర్ కమిషనర్కు పంపిస్తారని, 20న గ్రేటర్ కమిషనర్ అనుమతి లభిస్తుందని, 21న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.






