సిద్దిపేట (నమస్తే శేరిలింగంపల్లి): దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టారని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రజాకార్ల వారసుడిగా నిరంకుశ పరిపాలన కొనసాగించారని, ఆయనకు, ఆయన కుటుంబానికి దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

బీజేపీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, అందుకనే దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచామని సంజయ్ అన్నారు. ఈ గెలుపును తమ కార్యకర్తలకు అంకితమిస్తున్నామన్నారు. బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మత్యాగం చేసిన శ్రీనివాస్ స్ఫూర్తి కూడా ఈ విజయంలో ఉందని తెలిపారు. 2023 ఎన్నికల్లోనూ ఇదే విధంగా గెలుస్తామని, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో బీజేపీ శ్రేణులు ముందుకు సాగుతాయని, గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుపై రాష్ట్ర ప్రజలు సంతోష పడుతున్నారని సంజయ్ అన్నారు.





