- ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమే ఓంకార్ కు నివాళి అని ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ అన్నారు. మియాపూర్ ఎంఏ నగర్ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులుడు, మాజీ శాసనసభ్యుడు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపక నేత మద్దికాయల ఓంకార్ 12వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండ్రకుమార్ ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తాండ్ర కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. కార్పొరేటర్ సంస్థల చేతుల్లో వ్యవసాయాన్ని పెట్టేందుకే చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను గత ప్రభుత్వాల మాదిరిగానే అవలంబిస్తోందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ఓంకార్ ఆశయ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.

కన్నా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి గడ్డమీది హరినాథ్ గౌడ్, ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ఏఐఎఫ్డీడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఎ.పుష్ప, ఏఐఎఫ్డీవై గ్రేటర్ నాయకుడు డి మధుసూదన్, ఏఐసీటీయూ గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు అశోక్ అగర్వాల్ పాల్గొన్నారు.





