
– చందానగర్లో భవానీమాతకు తామర పుష్పాలతో సహస్త్రనామార్చన
– హూడాకాలనీ సంతోషిమాత భక్త సమాజం ఆద్వర్యంలో సామూహిక అక్షరాభ్యసం
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవరోజు ఘనంగా కొనసాగాయి. వాడవాడల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో ప్రత్యేక పూజలందుకున్నారు. చందానగర్లోని విశాఖ శ్రీ శారదాపీఠపాలిత వెంకటేశ్వరాలయ సముదాయంలోని శ్రీ భవానీమాత బుదవారం సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు, పీఠం రాష్ట్ర ఆగమ సలహాదారు సుదర్శనం సత్యసాయి, భవానీ ఆలయ అర్చకులు రవిశర్మల పర్యవేక్షణలో అమ్మవారికి శ్రీ చక్రార్చన, తామర పుష్పాలతో సహస్త్ర నామార్చన, పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సరస్వతీ దేవిని దర్శించుకున్నారు.

హూడా కాలనీలోని సంతోషిమాత భక్తసమాజం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో కాలనీలోని తల్లితండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పిల్లలచే అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా శాంతీనగర్ పోచమ్మ తల్లి, నెహ్రూనగర్లోని రేణుక ఎల్లమ్మ తల్లులు సైతం ఐదవ రోజు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో విశేష పూజలు అందుకున్నారు. పరిసర ప్రాంతాల భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.








