
శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూములను రక్షించడంలో శేరిలింగంపల్లి తహసీల్దారు వైఫల్యం చెందారని జనంకోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. గురువారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్ వైఖరి అనుమానాస్పదంగా ఉందని, ప్రభుత్వ భూముల అక్రమనలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. చందానగర్ సర్వేనెంబరు 172, మియాపూర్ సర్వేనెంబరు నెం. 100, 101, 44, 28లలో గల ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కలెక్టర్ తో పాటు ఆర్డీవో, జీహెచ్ఎంసీ కమీషనర్, కలెక్టర్లకు ఫిర్యాదు చేశామన్నారు. సర్వేయర్ల తప్పుడు రిపోర్టుల కారణంగా న్యాయస్థానంలో వివాదంలో చిక్కుకున్న భూములను కాపాడాల్సిన తహసీల్దార్ కార్యాలయం మౌనంగా ఉండడాన్ని జనంకోసం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి, శేరిలింగంపల్లి తహసీల్ కార్యాలయంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని జనం కోసం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అతి త్వరలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం అవకతవకలను మరిన్ని బయటపెట్టడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.