వివాహ వార్షికోత్సవం రోజున విషాదం – బైక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – భార్య మృతి, భర్త, కొడుకుకు తీవ్రగాయాలు

నమస్తే శేరిలింగంపల్లి: వివాహ వార్షికోత్సవం రోజున తమ‌ దాంపత్య జీవితం కలకాలం‌ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో‌ ఉండేలా చూడాలని‌ దైవ దర్శనం చేసుకుని ఆలయం నుంచి బైక్ పై వస్తున్న ఆ దంపతులను మృత్యు రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త, కొడుకు తీవ్ర గాయాలపాలైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలమల గ్రామానికి చెందిన ప్రసన్న, ప్రభాకర్ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ‌ కుమారుడు బన్నీతో కలిసి టీఎస్ 15 ఈఎస్ 9516‌ నంబర్ గల బైక్ పై ఆలయానికి వెళ్లారు. ఆలయం నుంచి తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో చందానగర్ ప్రధాన రహదారిపై‌ క్యాప్రీ హోటల్ వద్ద టీఎస్ 07 యూఏ 9793‌ నంబర్ గల కంటోన్మెంట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెనక కూర్చున్న ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ప్రభాకర్, కుమారుడు బన్నీ తీవ్ర గాయలకు గురవడంతో స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆర్టీసీ బస్సును చందానగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి‌ గురైన ప్రసన్న కుటుంబం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here