నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆర్ కేస్ కళానిలయం గురువులు సుందరి రవి చంద్ర శిష్య బృందంచే శనివారం గురువులందరికి “గురు వందన” అనే అంశంపై భరతనాట్య ప్రదర్శన చేశారు. సమాజంలో గురువు త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ లోని జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణు మూర్తి లా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలను,సద్గుణాలను ఎలా పొందాలో నేర్పే వారు గురువులు అంటూ కళ్లకు కట్టినట్టు భరతనాట్యం చేసి చూపించారు. సుందరి రవిచంద్ర శిష్యులు గురువులను ఒక సారి మనసారా స్మరించుకొని భరతనాట్య కళ ద్వారా గురువు లకి వందన సమర్పణ చేశారు. పుష్పాంజలి, శ్లోకాలు, ఆనంద నర్తన గణపతిమ్, మధురాష్టకం, శంభో శివ శంభో, చక్కనితల్లికి, నారాయణతేయ్ నమో నమో, మానస సంచరరేయ్, విష్ణు స్తుతి, అచ్యుతం కేశవం, పలుకీ బంగారమాయెహ్ న, గోవిందర్శిత, శ్రీమాన్ నారాయణ, ఎందరో మహానుభావులు అంశాలను సైతం ప్రదర్శించి ఆహుతులను మెప్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సాత్విక, మోక్ష వర్షిణి, హాసిని, శృతి, శ్రీదుల, సహస్ర, శాన్వి, నందిక, ప్రియాంక, కిరణ్మయి తదితరులు పాల్గొని ప్రదర్శన ఇచ్చారు.