నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ లో గల గచ్చిబౌలి నుండి మియపూర్ రోడ్ లో పొంగి పొర్లుతున్న డ్రైనేజీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, డ్రైనేజీ నీరు రోడ్డుపై ఏరులై ప్రవహిస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరమని మాదాపూర్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగుల రాధాకృష్ణ వాపోయారు. శుక్రవారం కొండాపూర్ లో వ్యాపార సముదాయాల ముందు ఉన్న మియాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు గల ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీటి ప్రవాహంలో పడవలు, పూలు వేసి బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ సమస్యతో సుమారు 300 పై చిలుకు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత మూడేళ్లుగా డ్రైనేజీ కిలోమీటర్ మేర నిత్యం పొంగుతూనే ఉందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు , ప్రజాప్రతినిధులకు స్థానికులు పలుమార్లు ఈ సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పాదచారులు, వాహనదారులు దుర్గందపూరితమైన వాసనను తట్టుకోలేక పోతున్నారని అన్నారు. కొండాపూర్ బస్ స్టాప్ లో బస్సు ఆగినప్పుడు ప్రజలు మురుగునీటి లోంచి నానాపాట్లు పడుతూ బస్సు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఎస్టీ మోర్చ అధ్యక్షుడు హనుమంత్ నాయక్, మాదాపూర్ డివిజన్ ఎస్టీ మోర్చ నాయకులు బాలు నాయక్ తో పాటు వికాస్, కృష్ణ. ప్రసాద్, సురేష్, హనీఫ్ , వ్యాపారస్తులు, కాలనీ వాసులు, పాదచారులు తదితరులు పాల్గొన్నారు.