- ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రీ ఫైనల్ పరీక్షలు
- మియాపూర్ శ్రీ ఆద్య కళాశాల యాజమాన్యం నిర్వాకం

నమస్తే శేరిలింగంపల్లి: కరోన మల్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే. ఐతే కొన్ని చోట్ల విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం సర్కారు నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులకు తరగతులు, పరీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం. మియాపూర్ మాతృశ్రీనగర్ లోని శ్రీ ఆద్య జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కళాశాలను యధావిధిగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలు నిర్వహిస్తుండగా గమనించిన స్థానికులు యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. కళాశాల తీరుపై ప్రశ్నించిన వారిపై డైరెక్టర్ బాలకృష్ణ దురుసుగా వ్యవహరించడంతో వారు పోలీసు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో యాజమాన్యం వెనకడుగు వేసింది. పరీక్ష రద్దుచేసి విద్యార్థులను వెనక్కి పంపించారు. రేపటి నుంచి ఆన్ లైన్ పరీక్షలు కొనసాగుతాయని ప్రకటించడంతో వివాదం సద్ధుమణిగింది. కాగా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన శ్రీ ఆద్యా కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.





