నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా ఆ సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించిన పలు విభాగాల వైద్యులకు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు, మహాప్రస్థానం సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ వీడియో ద్వారా వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు.

అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించిన వైద్యులను, సిబ్బంది సమాజంలో లో నిజమైన హీరోలని అన్నారు. ఆసుపత్రి సీఈవో డా.రియాజ్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సేవలందించిన కరోనా వారియర్స్ చరిత్రలో నిలిచిపోతారు. వారికి కృతజ్ఞత చూపించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు కరుణా గోపాల్, జీవన్ దాన్ ఇంచార్జ్ స్వర్ణలత, టిమ్స్ డైరెక్టర్ డా.విమల థామస్, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డా. స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.





