చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): తాను రాజకీయాల్లో చేరిన నుండి తన జీవితాన్ని ప్రజాసమస్యల పరిష్కారానికే అంకితం చేశానని, అవినీతికి తావులేకుండా ప్రజా సేవ చేస్తున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి అభ్యర్థి ఎన్.రామచందర్రావు అన్నారు. శనివారం చందానగర్ డివిజన్ లో బిజెపి నాయకులు పట్టభద్రుల ఓటర్లతో రామచందర్రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎమ్మెల్సీ పదవీకాలంలో నిరంతరం ప్రజాసమస్యలపై గళం విప్పానని, భవిష్యత్తులో సైతం ఇదే తరహాలో సేవలందిస్తానని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నాదని, ప్రభుత్వంలోని పెద్దలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా నిజాయితీగా ప్రజా సేవ చేస్తున్నానని, మరోసారి ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి, చందానగర్ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి, విజయభాస్కరరెడ్డి, కప్పర ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, వేణుమాధవ్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






