నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కెసిఆర్కు చెంపపెట్టు కావాలని బిజెపి రంగారెడ్డి జిల్లా(అర్బన్) ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్గౌడ్ అన్నారు. మార్చి 14వ తేదీన జరుగబోయే రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లా పట్టభద్రులు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధి లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసిన గోవర్ధన్గౌడ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాంచందర్ రావు కి మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు పీ ఆర్ సి అమలు చేయకుండా ద్రోహం చేస్తుందని తెలిపారు. ఉద్యమం కోసం త్యాగాలు చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించకుండా మోసగించారని తెలిపారు. ఎన్నికల్లో గద్దెనెక్కేందుకు వాగ్ధానాలిచ్చి తీరా అధికారం చేపట్టాక ప్రజల నమ్మకానికి తూట్లు పొడిచాడని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేస్తున్న కెసిఆర్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహిపాల్ రెడ్డి, మారం వెంకట్, రాజు శెట్టి, చిట్టారెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, శ్రవణ్ పాండే తదితరులు పాల్గొన్నారు.






