మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్లో ఉన్న పలు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఇంటి నంబర్లు, ఇంటి పట్టాలను ఇప్పించాలని కోరుతూ ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వి.తుకారాం నాయక్ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్, టేకు నరసింహ నగర్, నడిగడ్డ తండా, పోగుల ఆగయ్య నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, భగత్ సింగ్ నగర్, ఓంకార్ నగర్లలో గత 30 సంవత్సరాలుగా పేద ప్రజలు నివాసం ఉంటున్నారని అన్నారు. అయిప్పటికీ వారికి ఇప్పటికీ ఇంటి నంబర్లు లేవన్నారు. కనుక వారికి ఇంటి పట్టాలతోపాటు ఇంటి నంబర్లను కూడా కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) నాయకులు పి.మురళి, ఎండీ సుల్తానా బేగం, బి.విమల, డి.లక్ష్మి, కె.ఇందిర, జి.శివాని పాల్గొన్నారు.






