గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే శాసనమండలిలో ప్రజాసమస్యలపై గెంతెత్తి పోరాడతానని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారావు అన్నారు. ఆదివారం మసీదు బండ లోని మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ నివాసంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామచంద్రారావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ప్రజలకు ఎంతగానో సేవలందించానని, కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలిచానని గుర్తు చేశారు.

మరోసారి తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతితో పాటు ఉద్యోగులకు పి .ఆర్. సి సమయానుసారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం కావాలని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం గుండా రాజకీయాలు చేస్తూ హత్యలను ప్రోత్సహిస్తూ, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. పట్టభద్రులంతా మార్చి 14వ తారీఖున మొదటి ప్రాధాన్యత ఓటును ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్ర రావుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ గరికపాటి మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, నాయకులు గజ్జల యోగానంద్ ,మువ్వ సత్యనారాయణ , బుచ్చిరెడ్డి, జయలక్ష్మి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.