శేరిలింగంపల్లి, ఏప్రిల్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను ఇరిగేషన్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువు దశ దిశ మారుతుందని, వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు.
కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణ ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్ధవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందని, ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపజేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు. కైదమ్మ కుంట చెరువుకు దశ దిశ మారిందని, ఎన్నో ఏండ్ల సమస్య తీరుతుందని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నళిని, AE పావని, జలమండలి అధికారులు మేనేజర్ శ్రీహరి, CSR ఐటి సంస్థ ప్రతినిధులు చైతన్య , రాము, నాయకుడు సుదేశ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.