- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు మద్దతునివ్వాలని పిలుపు
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో హాస్టల్స్ యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళతామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో మాదాపూర్ లోని బుట్ట కన్వెన్షన్ సెంటర్ లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జిలు ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, పూల రవీందర్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఐటీ కారిడార్ అసోసియేషన్ సంఘం తమ సమస్యలను ఇది వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిందన్నారు. కరోనా విజృంభణతో హాస్టల్స్ నిర్వాహకులకు తీవ్ర నష్టం జరిగిందని, అయితే వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ కరెంట్ బిల్లులతో పాటు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా వాడేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ గురించి అందరం శుభవార్త వింటామన్నారు.

హాస్టల్స్ అసోసియేషన్ మద్దతు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో అవసరమని, హోస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జిలను పెంచలేదని అసోసియేషన్ ప్రతినిధులు గమనించాలని కోరారు. శేరిలింగంపల్లిలోని అన్ని డివిజన్ల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి హాస్టల్ సంఘం ప్రతినిధులు కరెంట్ బిల్లులతోపాటు మౌలిక వసతుల సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, తెరాస నాయకులు శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

