శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): కొత్తగూడ సఫారీనగర్ లోని న్యూ బ్లూమ్ హైస్కూల్ లో ఐక్యరాజ్యసమితి అవగాహన దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాల ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ అని అన్నారు. 1945 అక్టోబరు 24వ తేదీన 51 దేశాలతో ఏర్పాటై ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని, దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉందన్నారు. ఐక్యరాజ్యసమితిలో 193 సభ్యదేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని, రెండు దేశాలు తాత్కాలికంగా గుర్తించ బడ్డాయని తెలిపారు. భారతదేశం కూడా త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశాల సరసన చేరుతుందని ఆశిద్దామని అన్నారు. అప్పుడే మన దేశ ప్రభావం కూడా ప్రపంచ దేశాలపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.







