శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదే అని, తమ వద్దకు వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులపై నమ్మకంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాలనీ, బస్తి అసోసియేషన్ సభ్యులు తమ గోడును విన్నవించుకుంటున్నారని అన్నారు.హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డును ఆమె పరిశీలించారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసి అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై పక్కా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను సంబంధిత అధికారులతో కలిసి పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే మంజీరా రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఇప్పటికే వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఇప్పటికైనా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని నగర్ మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.