శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతి అనే యువతిని దారుణంగా హత్య చేసిన నిందితుడు మహేందర్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును విచారణ జరిపించి అతడికి ఉరి శిక్ష విధించాలని బీసీ సంఘం రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడలో ఇటీవల స్వాతి యాదవ్ ను అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే నరరూప రాక్షసుడు ప్రేమ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి లొంగపరచుకొని రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఆగస్టు 23వ తేదీన తల, కాళ్లు, చేతులు నరికి అతి దారుణంగా హత్య చేసి మూసీలో పడవేశాడని అన్నారు. ఈ విషయమై బిసి ఐక్యవేదిక తరపున, వికారాబాద్ జిల్లా నాయకులతో కలిసి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఆ నరహంతకుడికి ఫాస్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి ఉరిశిక్ష పడేంత వరకూ బీసీ ఐక్య వేదిక కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఆయన వెంట బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, గొర్రెల మేకల పెంపకం దారుల వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, పూడూరు మండల్ మాజీ ఎంపీపీ మల్లేష్, బీసీ సంఘం జిల్లా కన్వీనర్ శంకర్ యాదవ్, దేవనోనిగూడెం మాజీ సర్పంచ్ నారాయణ యాదవ్, సిరిగాయిపల్లి మాజీ సర్పంచ్ వెంకట దాసు, వికారాబాద్ బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ శ్రీశైలం యాదవ్, బీసీ సంఘం ధారూర్ మండల కన్వీనర్ సుధాకర్ యాదవ్, బీసీ సంఘం వికారాబాద్ మండల కన్వీనర్ యాదగిరి యాదవ్, సంపత్ యాదవ్, మహేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.






