శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఢిల్లీలో ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించిన సందర్భంగా మియాపూర్ బస్ డిపో ఎదుట ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయోవత్స వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తామని తెలిపారు. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీలో మళ్లీ తాము అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సమయం పట్టచ్చేమో గానీ అవినీతి మీద నీతి విజయం సాధిస్తుందని అన్నారు. స్కాంలు చేసే వాళ్ళకి ఇది ప్రజలు ఇచ్చిన చెంపపెట్టు లాంటి తీర్పు అని అన్నారు. తెలంగాణలో కాషాయజెండా ఎగరవేయటమే లక్ష్యమని, తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.