
- పీజేఆర్ స్టేడియంలో ఉత్సాహంగా వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): పిల్లలు, యువతలో క్రీడలు, శారీరక దృఢత్వంపై ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) నగరవ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మియాపూర్ పిజెఆర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాన్ని శాసనసభ్యుడు గాంధీ, CMC కమిషనర్ సృజన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ (క్రీడలు), వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలను, యువతను క్రమబద్ధమైన క్రీడా కార్యకలాపాలలో నిమగ్నం చేయడం ద్వారా వారిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, సర్వతోముఖాభివృద్ధిని పెంపొందించడం ఈ శిక్షణ శిబిరాల ప్రధాన ఉద్దేశమని అన్నారు.

శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలు, వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, జోన్ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువ క్రీడాకారుల చురుకైన భాగస్వామ్యం, క్రీడాకారులతో ముఖాముఖి చర్చించి, వర్ధమాన ప్రతిభను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందుబాటులో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, విద్యార్థులు, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలని, వేసవిలో ఎండల దృష్ట్యా శిక్షణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో ఆరు బయట క్రీడలకు దూరంగా ఉండాలని, క్రీడల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని అన్నారు.





