ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ పి. మోహన్ రెడ్డి

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): 2025-2026 సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ పి. మోహన్ రెడ్డి కోరారు. గురువారం సర్కిల్ కార్యాలయంలో రెవిన్యూ విభాగంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉప కమీషనర్ మాట్లాడుతూ.. ఏఎంసీలు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఏప్రిల్ నెల ముందస్తు లక్ష్యమైన 64.41 కోట్లు (ఎర్లీ బర్డ్ పథకం ద్వారా)వసూలు చేయాలని, సెలవు రోజులలో కుడా ఆస్తి పన్ను వసూలు చేయాలని అదేశించారు. గృహస్తులు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను 5 శాతం రాయితీతో ముందస్తుగా చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకొని తమ గృహ, వాణిజ్య ప్రాంతాలకు సంబంధించిన ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించాలని కోరారు.

ఈనెల 1వ తేదీ నుంచి ఎర్లీ బర్డ్ పథకం ప్రారంభమైందని, ఈనెల 30 వరకు మాత్రమే ముందస్తు పన్ను చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన వారు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ పథకానికి అర్హులు అని ఉప కమీషనర్ తెలిపారు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఏప్రిల్ నెలలోని అన్ని సెలవు రోజులలో బిల్ కలెక్టర్ అందుబాటులో ఉంటారని, సర్కిల్ ఆఫీస్ సిటిజన్ సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుందని, ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, మీ సేవా సెంటర్ల లో ఆస్తి పన్ను చెలించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చందానగర్ సర్కిల్ ప్రజలకు ఉప కమిషనర్ పి. మోహన్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఏఎంసి మహేందర్ రెడ్డి, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here