శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): RVM హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ రోగికి శాస్త్ర చికిత్స చేసి కణతిని తొలగించారు. ఈ సందర్భంగా RVM హాస్పిటల్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హాస్పిటల్ సూపరిండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ హాస్పటల్లో ఇప్పటికే అనేక రకాల చికిత్సలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలోనే గత ఎనిమిది నెలల కిందట క్యాన్సర్ చికిత్సను సైతం ప్రారంభించామని అన్నారు. ఆంకాలజీ శస్త్ర చికిత్సలు, రేడియేషన్ థెరపి, కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లా నడికుడ మండలం, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఎరుకల సాంబయ్య(65) కడుపు నొప్పితో బాధపడుతూ నగరంలోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స చేయించుకునే ప్రయత్నం చేసి చివరకు RVM హాస్పిటల్ కి వచ్చారని అన్నారు.
అయితే అతనిలో ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ తో కూడిన ఒక భారీ కణతిని గుర్తించడం జరిగిందని అన్నరు. దీంతో తమ వైద్యుల బృందమైన జనరల్ సర్జన్ టి శ్రీనివాస్, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎంఎస్ఎస్ కీర్తి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు, అనేస్తీసియ వైద్యుడు వంశీ కిరణ్ లు కలసి10 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాంబయ్య కడుపులోని క్యాన్సర్ కణతిని విజయవంతంగా తొలగించి RVM హాస్పిటల్ శస్త్ర చికిత్సలో మరో మైలురాయిని సాధించామని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇంతటి అరుదైన చికిత్సను పూర్తి చేయడం ఇలాంటి రోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు మాట్లాడుతూ.. జీర్ణాశయం లోపల చేసే అరుదైన శస్త్ర చికిత్సలో సాంబయ్యకు చేసింది విశేషమైనదని అన్నారు. RVM లో అన్ని రకాల పరికరాలతో పాటు ఉత్తమైన వైద్య బృందం, నర్సింగ్ కేర్ వల్లే చికిత్స విజయవంతంగా పూర్తయి రోగి పూర్తి ఆరోగ్యంతో 12 రోజులలోనే డిశ్చార్జ్ అవ్వడం జరుగుతున్నదని అన్నరు. రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సాంబయ్యను నగరంలోని రెండు ప్రముఖ హాస్పిటల్స్ కి చికిత్స కోసం తీసుకువెళ్లామని, రూ.8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారన్నారు. నిరుపేదలమైన తాము అంతటి ఖరీదైన చికిత్స చేసుకోలేమని వాపోతున్న తరుణంలో RVM హాస్పిటల్స్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చామని అన్నారు. ఇక్కడి వైద్య బృందం రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఇంతటి కఠినమైన శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసి సాంబయ్యకు పునర్జన్మను ప్రసాదించారని అన్నారు. తమ కుటుంబం అంతా RVM హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.