శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ ని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్లో నెలకొన్న పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ ని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, మియాపూర్ డివిజన్ పరిధిలో చేపట్టబడిన నాలాల విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని, పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులను ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. రోడ్ల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయడం, మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, కాలనీలలో వీధి దీపాల సమర్థవంతమైన ఏర్పాటు కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని అన్నారు. అభివృద్ధి పనులలో వేగం పెంచడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక వనతులు అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. దీనిపై జిహెచ్ఎంసి కమిషనర్ సానుకూలంగా స్పందించారు.






