శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో BHEL township లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, తారానగర్ విద్యానికేతన్ హైస్కూల్ లో ఉపాధ్యాయురాళ్లకు, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పోటీలలో ప్రిన్సిపాల్ కవిత, విజయలక్ష్మి, రమ్య విజేతలను ఎంపిక చేశారు. ఈ రెండు పోటీలలో 30 మంది చొప్పున మొత్తం 60 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యాపకురాళ్ళు కనకదుర్గ, వందన, ప్రజ్వల, జ్యోతిర్మయి, స్కూల్ కరస్పాండెంట్ శ్రీ రామాచారి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






